IND vs SA: కొండంత కొట్టినా కష్టంగా..

టీమ్‌ఇండియా మురిసింది. ఆదివారం భారీ స్కోర్ల మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట భారత్‌ దంచి కొట్టింది. సూర్యకుమార్‌ (61;  22 బంతుల్లో 5×4, 5×6), రాహుల్‌ (57; 28 బంతుల్లో 5×4, 4×6), కోహ్లి (49 నాటౌట్‌;  28 బంతుల్లో 7×4, 1×6), రోహిత్‌ (43; 37 బంతుల్లో 7×4, 1×6) చెలరేగడంతో 3 వికెట్లకు 237 పరుగులు భారీ స్కోరు సాధించింది.

Updated : 03 Oct 2022 07:54 IST

రెండో టీ20లో భారత్‌ విజయం
సిరీస్‌ కైవసం
చెలరేగిన సూర్య, రాహుల్‌
మిల్లర్‌ మెరుపు శతకం వృథా
గువాహటి

దంచుడే దంచుడు. పరుగులే పరుగులు. గువాహటిలో చివరికి టీమ్‌ఇండియాదే పైచేయి అయినా దక్షిణాఫ్రికా  పోరాటమూ ఆకట్టుకుంది.

అలవాటైన రీతిలో సూర్య భగ్గుమన్న వేళ.. రాహులూ దూకుడు పెంచిన సమయాన.. రోహిత్‌, కోహ్లి కూడా సమయోచితంగా రాణించిన తరుణాన పరుగుల వరద పారించిన భారత్‌ రెండో టీ20లోనూ గెలిచి, మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను చేజిక్కించుకుంది. అయినా ఏదో అసంతృప్తి. కొండంత స్కోరు చేసినా బౌలర్లు తేలిపోవడంతో గెలుపు కోసం భారత్‌కు కష్టపడక తప్పలేదు. ప్రత్యర్థి అంత తేలిగ్గా తలవంచలేదు.  వీరబాదుడు బాదిన మిల్లర్‌ పెను విధ్వంసంతో రోహిత్‌ బృందాన్ని కలవరపెట్టాడు. తొలి టీ20లో అదరగొట్టిన అర్ష్‌దీప్‌ ఈ మ్యాచ్‌లో ఏకంగా 62 పరుగులివ్వడమే కాదు.. మూడు నోబాల్స్‌, రెండు వైడ్లు వేసి ప్రపంచకప్‌ ముంగిట మన బౌలింగ్‌పై ఆందోళనను ఇంకా పెంచాడు.

టీమ్‌ఇండియా మురిసింది. ఆదివారం భారీ స్కోర్ల మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. మొదట భారత్‌ దంచి కొట్టింది. సూర్యకుమార్‌ (61;  22 బంతుల్లో 5×4, 5×6), రాహుల్‌ (57; 28 బంతుల్లో 5×4, 4×6), కోహ్లి (49 నాటౌట్‌;  28 బంతుల్లో 7×4, 1×6), రోహిత్‌ (43; 37 బంతుల్లో 7×4, 1×6) చెలరేగడంతో 3 వికెట్లకు 237 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఛేదన ఆరంభంలో తడబడ్డా దక్షిణాఫ్రికా గట్టి పోటీ ఇచ్చింది. మిల్లర్‌ (106 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 7×6), డికాక్‌ (69 నాటౌట్‌; 48 బంతుల్లో 4×3, 4×6) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 2-0 ఆధిక్యం సంపాదించింది. చివరి టీ20 మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.

మిల్లర్‌ విధ్వంసం: కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆపై ఒక్క పరుగుకే రెండు వికెట్లు పడగొట్టింది. అయినా భారత్‌కు కంగారు తప్పలేదు. విజయం అనుకున్నంత తేలిగ్గా దక్కలేదు. రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ బవుమా (0), రొసో (0)ను ఔట్‌ చేయడం ద్వారా దక్షిణాఫ్రికాకు షాకిచ్చినా.. డికాక్‌, మార్‌క్రమ్‌ (33; 19 బంతుల్లో 4×4, 1×6) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ముఖ్యంగా మార్‌క్రమ్‌ చెలరేగిపోయాడు. ఆరు ఓవర్లకు స్కోరు 45/2. ఏడో ఓవర్లో మార్‌క్రమ్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ పట్టు బిగిస్తుందేమో అనిపించింది. 10 ఓవర్లకు స్కోరు 70/3. కానీ క్రమంగా జోరు పెంచిన మిల్లర్‌ విధ్వంసక విన్యాసాలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఎడా పెడా ఫోర్లు, సిక్స్‌లు బాదాడు. భారత బౌలర్లు కూడా లయ తప్పారు. వారిని మిల్లర్‌ ఏమాత్రం లెక్క చేయలేదు. మిల్లర్‌ ధాటికి 12వ ఓవర్లో అశ్విన్‌ 19 పరుగులు సమర్పించుకోగా.. ఆలస్యంగా జోరందుకున్న డికాక్‌ ధాటికి ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో అక్షర్‌ 18 పరుగులిచ్చుకున్నాడు. అర్ష్‌దీప్‌, హర్షల్‌ కూడా వాళ్లను నియంత్రించలేకపోయారు. అయినా చివరి నాలుగు ఓవర్లలో గెలవాలటే దక్షిణాఫ్రికా 82  పరుగులు చేయాల్సిన స్థితి. అయితే ఆ జట్టు ఓవర్‌కు 20కి పైనే చేయాల్సివున్నా బ్యాట్స్‌మెన్‌ జోరుతో భారత్‌ది కూడా ధీమాగా ఉండలేని పరిస్థితి. కానీ ఆ దశలో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన దీపక్‌ చాహర్‌.. 17వ ఓవర్లో ఒకే ఒక్క బౌండరీ ఇచ్చి భారత్‌పై ఒత్తిడిని పోగొట్టాడు. ఆరంభంలో అతడు తన తొలి మూడు ఓవర్లలో 16 పరుగులే ఇవ్వడం విశేషం. 18వ ఓవర్లో హర్షల్‌ 11 పరుగులే ఇవ్వడంతో జట్టు ఊపిరిపీల్చుకుంది. అయితే చివరి రెండు ఓవర్లలో 63 పరుగులు చేయాల్సివున్నా, గెలుపు అసాధ్యమే అయినా మిల్లర్‌, డికాక్‌ మాత్రం ప్రయత్నం చేయకుండా వదల్లేదు. 19వ ఓవర్లో (అర్ష్‌దీప్‌) రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు దంచిన మిల్లర్‌.. అక్షర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లతో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖరి రెండు ఓవర్లలో దక్షిణాఫ్రికా 46 పరుగులు రాబట్టింది. మిల్లర్‌, డికాక్‌ జంట అభేద్యమైన నాలుగో వికెట్‌కు 174 పరుగులు జోడించింది. 

రాహుల్‌ ధనాధన్‌: దంచుడే దంచుడు. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఇదే తీరు. క్రీజులోకి వచ్చిన ప్రతి భారత బ్యాట్స్‌మన్‌ దక్షిణాఫ్రికా పేసర్లను ఉతికేయడంతో జట్టు కొండంత స్కోరు సాధించింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న సఫారీ జట్టుకు కాసేపైనా ఆనందం దక్కలేదు. రాహుల్‌, రోహిత్‌ మొదటి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే.. సూర్యకుమార్‌, కోహ్లి జంట మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించింది. నెమ్మదిగా ఆడుతున్నాడంటూ తనపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెడుతూ రాహుల్‌ రెచ్చిపోయాడు. రెండొందలకు పైగా స్ట్రైక్‌రేట్‌తో సఫారీల బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే పాయింట్‌ దిశగా బౌండరీకి తరలించి తన ఉద్దేశాన్ని చాటి చెప్పిన రాహుల్‌.. ఆ తర్వాత పార్నెల్‌ బౌలింగ్‌లో వరసగా 6, 4 దంచాడు. ఆ తర్వాత కూడా వీలైనప్పుడల్లా చక్కని షాట్లు ఆడుతూ అలరించాడు. ఏ బౌలర్‌నూ వదల్లేదు. మరో ఓపెనర్‌ రోహిత్‌ కూడా తక్కువేమీ తినలేదు. కాస్త అదృష్టం తోడై పరుగుల ఖాతా తెరిచినా.. ఆ తర్వాత తనదైన దూకుడుతో అలరించాడు. ఎంగిడి స్లో బంతిని సిక్స్‌కు దంచి కొట్టిన రోహిత్‌.. పార్నెల్‌ బంతిని షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో, రబాడ డెలివరీని కవర్స్‌, మీడాఫ్‌ మధ్య నుంచి బౌండరీకి తరలించాడు. 9 ఓవర్లలో 94/0తో టీమ్‌ఇండియా తిరుగులేని స్థితిలో నిలిచింది.

భగ్గుమన్న సూర్య: ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతున్న దశలో కేశవ్‌ తన వరుస ఓవర్లలో దూకుడు మీదున్న ఓపెనర్లనిద్దరినీ ఔట్‌ చేయడం ద్వారా దక్షిణాఫ్రికాకు కాస్త ఊరటనిచ్చాడు. అయినా ఆ జట్టు కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. సూర్యకుమార్‌ రూపంలో సునామీ ఆ జట్టును ముంచేసింది. అతడు ముచ్చటైన షాట్లతో కనువిందు చేస్తూ అభిమానులను ఉర్రూతలూగించాడు. అతడి స్టాన్స్‌ చూసే బౌలర్‌ బెంబేలెత్తిపోయుంటాడు. చురుకైన కదలికలతో క్రీజులో డాన్సే వేశాడు సూర్య. స్వీప్‌, కట్‌, ఫ్లిక్‌.. ఇలా అతడు ఆడని షాట్లే లేవు. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లోనైతే ఏకంగా రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు దంచేశాడు. ఎక్కడ వేసినా, ఎలా వేసినా సూర్య కొడుతుండడంతో బౌలర్లకేమీ పాలుపోలేదు. పార్నెల్‌ బౌలింగ్‌తో సిక్స్‌తో సూర్య 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లి నెమ్మదిగా మొదలెట్టినా క్రమంగా తానూ విరుచుకుపడ్డాడు. పార్నెల్‌ ఓవర్లో సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టాడు. 19వ ఓవర్లో సూర్య రనౌటైనా.. కోహ్లి వరుసగా రెండు ఫోర్లు సాధించాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఫోర్‌, రెండు సిక్స్‌లతో ఇన్నింగ్స్‌కు కార్తీక్‌ (17 నాటౌట్‌) ఘనమైన ముగింపునిచ్చాడు.


మ్యాచ్‌లో అనుకోని అతిథి

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 నడుస్తుండగా అనూహ్య ఉదంతం చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ పూర్తయి ఎనిమిదో ఓవర్‌ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ గువాహాటి స్టేడియంలోకి వచ్చేసింది. దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. అభిమానులకు కూడా ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు. దీంతో మైదానంలోకి హుటాహుటిన వెళ్లిన సిబ్బంది పామును పట్టి బయటకు తీసుకెళ్లిపోయారు. మైదానంలోకి కుక్కలు రావడం సాధారణమే కానీ.. ఇలా పాము రావడం అనూహ్యం. దీంతో కాసేపు కెమెరాలన్ని దాని చుట్టూనే తిరిగాయి. ఇదొక్కటే కాదు మ్యాచ్‌లో నిర్వాహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికా ఛేదనలో దీపక్‌ చాహర్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతి వేసిన తర్వాత స్టేడియంలోని నాలుగు ఫ్లడ్‌ లైట్లలో ఒక ఫ్లడ్‌లైట్‌ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆటకు 18 నిమిషాలు అంతరాయం కలిగింది.


భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ ఎల్బీ (బి) మహరాజ్‌ 57; రోహిత్‌ శర్మ (సి) స్టబ్స్‌ (బి) మహరాజ్‌ 43; కోహ్లి నాటౌట్‌ 49; సూర్యకుమార్‌ యాదవ్‌ రనౌట్‌ 61; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 10

మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 237;

వికెట్ల పతనం: 1-96, 2-107, 3-209;

బౌలింగ్‌: రబాడ 4-0-57-0; పార్నెల్‌ 4-0-54-0; ఎంగిడి 4-0-49-0; కేశవ్‌ మహరాజ్‌ 4-0-23-2; నోకియా 3-0-41-0; మార్‌క్రమ్‌ 1-0-9-0

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బవుమా (సి) కోహ్లి (బి) అర్ష్‌దీప్‌ 0; డికాక్‌ నాటౌట్‌ 69; రొసో (సి) కార్తీక్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; మార్‌క్రమ్‌ (బి) అక్షర్‌ 33; మిల్లర్‌ నాటౌట్‌ 106; ఎక్స్‌ట్రాలు 13

మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 221;

వికెట్ల పతనం: 1-1, 2-1, 3-47;

బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-24-0; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-62-2; రవిచంద్రన్‌ అశ్విన్‌ 4-0-37-0; అక్షర్‌ 4-0-53-1; హర్షల్‌ 4-0-45-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని