ఆస్ట్రేలియా 274/5
కొనసాగిన భారత ఫీల్డింగ్ వైఫల్యం
తొలి రోజు ఆట ఆసీస్దే
లబుషేన్ శతకం
బ్రిస్బేన్
పేస్ ప్రధానాస్త్రం బుమ్రా లేడు.. స్పిన్ భారాన్ని మోసే అశ్విన్ లేడు.. మూడో టెస్టు మాత్రమే ఆడుతోన్న సిరాజే ఎక్కువ అనుభవజ్ఞుడు.. ఇద్దరు బౌలర్లు అరంగేట్రం చేశారు.. ఇదీ ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత బౌలింగ్ దళం పరిస్థితి. అయితేనేం..
మన బౌలర్లు మెరుగైన ప్రదర్శనే చేశారు. ఓపెనర్లను త్వరగానే ఔట్ చేసి జట్టుకు ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం కల్పించారు. కానీ మరోసారి ఫీల్డింగ్ వైఫల్యం.. జట్టును వెనక్కిలాగింది. టీమ్ఇండియా ఫీల్డర్ల తప్పిదాలతో బతికిపోయిన లబుషేన్ శతకంతో ఆస్ట్రేలియాను ముందంజలో నిలిపాడు. తొలి రోజు ఆటలో ఆధిపత్యం ఆతిథ్య జట్టుదే.
బోర్డర్- గావస్కర్ సిరీస్లో చివరిదైన నాలుగో టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. పెద్దగా అనుభవం లేని టీమ్ఇండియా బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ.. లబుషేన్ (108; 204 బంతుల్లో 9×4) సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి రోజు, శుక్రవారం టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆట ఆఖరుకు తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 274 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (1), హారిస్ (5)ను భారత బౌలర్లు త్వరగానే పెవిలియన్ చేర్చినప్పటికీ.. స్మిత్ (36), వేడ్ (45; 87 బంతుల్లో 6×4)లతో కలిసి లబుషేన్ ఆ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ పైన్ (38 బ్యాటింగ్), ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నటరాజన్ (2/63) రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్తోనే నటరాజన్, వాషింగ్టన్ సుందర్ టెస్టు అరంగేట్రం చేశారు. జడేజా, అశ్విన్, విహారి, బుమ్రా గాయపడ్డ నేపథ్యంలో వీరితో పాటు మయాంక్ అగర్వాల్, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు.
ఓపెనర్లను త్వరగానే..: గత 31 టెస్టుల్లో ఓటమే (24 విజయాలు, 7డ్రాలు) లేదు.. చివరగా ఆడిన ఏడు టెస్టుల్లోనూ విజయం ఆ జట్టుదే.. గబ్బాలో ఇలాంటి గొప్ప రికార్డున్న ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పెద్దగా అనుభవం లేని భారత బౌలింగ్ దళం ఏ మేరకు నిలువరిస్తుందోనన్న అనుమానాలు కలిగాయి. కానీ సిరాజ్ (1/51) ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వార్నర్ను ఔట్ చేసి ఆ జట్టుకు షాకిచ్చాడు. మంచి లైన్, లెంగ్త్లో పడ్డ బంతిని డిఫెన్స్ చేయాలని వార్నర్ ప్రయత్నించాడు. అయితే కాస్త స్వింగ్ అయి ఎడ్జ్ తీసుకుని తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బంతిని సెకండ్ స్లిప్లో ఉన్న రోహిత్ కుడివైపు డైవ్ చేసి అద్భుత రీతిలో అందుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హారిస్ను శార్దూల్ (1/67) తన తొలి బంతికే పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 17 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ఈ దశలో లబుషేన్, స్మిత్ కలిసి జట్టును కాపాడే బాధ్యత తీసుకున్నారు. లబుషేన్ మరీ నెమ్మదిగా ఆడాడు. తొలి 50 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ మరోవైపు స్మిత్.. శార్దూల్ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు రాబట్టాడు.
అతను నిలిచి..: మూడో వికెట్కు 70 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న లబుషేన్, స్మిత్ జోడీని లంచ్ విరామం తర్వాత సుందర్ (1/63) విడగొట్టాడు. లెగ్సైడ్ ఫీల్డర్లను మోహరించి.. ఆ దిశగా ఆడేలా స్మిత్ను ఉసిగొల్పి వికెట్ సాధించడం విశేషం. ఆ వెంటనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న లబుషేన్.. వేడ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. సైని గాయంతో మైదానం వీడడంతో.. నలుగురే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. భారత ఫీల్డర్ల వైఫల్యంతో బతికిపోయిన లబుషేన్ సెంచరీ పూర్తి చేశాడు. వేడ్ కూడా ధాటిగా ఆడటంతో భారత్కు కష్టాలు పెరిగాయి. అయితే నటరాజన్ మళ్లీ భారత్ను పోటీలోకి తెచ్చాడు. నాలుగో వికెట్కు 113 పరుగులు జోడించిన లబుషేన్, వేడ్లను వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. కానీ తర్వాత బౌలర్లు ఒత్తిడి కొనసాగించలేక పోయారు. దీంతో మరో వికెట్ పడకుండానే ఆట ముగిసింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 1; హారిస్ (సి) సుందర్ (బి) శార్దూల్ 5; లబుషేన్ (సి) పంత్ (బి) నటరాజన్ 108; స్మిత్ (సి) రోహిత్ (బి) సుందర్ 36; వేడ్ (సి) శార్దూల్ (బి) నటరాజన్ 45; గ్రీన్ బ్యాటింగ్ 28; పైన్ బ్యాటింగ్ 38; ఎక్స్ట్రాలు 13; మొత్తం: (87 ఓవర్లలో 5 వికెట్లకు) 274; వికెట్ల పతనం: 1-4, 2-17, 3-87, 4-200, 5-213; బౌలింగ్: సిరాజ్ 19-8-51-1; నటరాజన్ 20-2-63-2; శార్దూల్ 18-5-67-1; సైని 7.5-2-21-0; వాషింగ్టన్ సుందర్ 22-4-63-1; రోహిత్ శర్మ 0.1-0-1-0
ఈసారి సైని..
భారత జట్టును ఆటగాళ్ల గాయాల సమస్య వదిలేలా లేదు. ఇప్పటికే కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయిన ఆ జట్టు.. నాలుగో టెస్టుకు పదకొండు మందిని ఎంపిక చేయడం కోసం తంటాలు పడింది. ఈ పరిస్థితుల్లో పేసర్ సైని గజ్జల్లో నొప్పితో తొలి రోజు ఆటలో మైదానం వీడడం ఆందోళన కలిగిస్తోంది. రెండో సెషన్లో ఇన్నింగ్స్ 36వ (అతడికి ఎనిమిదోది) ఓవర్లో అయిదో బంతి వేసిన తర్వాత అతను నొప్పితో మైదానాన్ని వీడాడు. సైనిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. రెండో రోజు అతను మైదానంలోకి వస్తాడో లేదో తెలియదు.
ఆ ఇద్దరు తప్ప..
ఆస్ట్రేలియాతో సిరీస్లో పూర్తిగా నాలుగు టెస్టులు ఆడిన భారత ఆటగాళ్లు కేవలం ఇద్దరే. వాళ్లలో తాత్కాలిక కెప్టెన్ రహానె ఒకరు కాగా.. మరొకరు పుజారా. ఆటగాళ్ల ప్రదర్శన, గాయాల సమస్య కారణంగా తొలి మ్యాచ్ తర్వాత ప్రతి టెస్టుకూ జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. తొలి టెస్టు తర్వాత రెండో మ్యాచ్ కోసం జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. మూడో టెస్టు తుది జట్టులో రెండు మార్పులు చేశారు. ఇక నాలుగో టెస్టు కోసం మరోసారి నాలుగు మార్పులు చేయాల్సి వచ్చింది.
4
ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో అయిదుగురు భారత బౌలర్ల మొత్తం అనుభవం 4 టెస్టులే. ఈ సిరీస్లోనే రెండో టెస్టులో అరంగేట్రం చేసిన సిరాజ్కే ఈ మ్యాచ్లో ఆడుతున్న మిగతావాళ్ల కంటే ఎక్కువ అనుభవం (2 టెస్టులు) ఉంది. మూడో టెస్టులో అరంగేట్రం చేసిన సైనీకి ఇది రెండో మ్యాచ్. శార్దూల్కు కూడా ఇది రెండో టెస్టే. నటరాజన్, సుందర్ అరంగేట్ర ఆటగాళ్లు.
2
మూడు అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్లో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే అన్ని మ్యాచ్ల్లో ఆడడం క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 1995లో విజ్డెన్ ట్రోఫీలో భాగంగా వెస్టిండీస్తో సిరీస్లో ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాత్రమే అన్ని మ్యాచ్లూ (6) ఆడారు.