నాలుగో టెస్టు పిచ్ ఎలా ఉండనుందో అర్థమైంది: బెన్ఫోక్స్
(Photo: England Cricket Twitter)
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాతో తలపడిన మూడో టెస్టులో తమ జట్టు పూర్తిగా విఫలమైందని, కోహ్లీసేన బాగా ఆడిందని ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ఫోక్స్ అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టుకు ముందు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చివరి టెస్టులో తమ జట్టు మరింత బాగా బ్యాటింగ్ చేయడానికి సరైన మార్గం కనుగొనాలని తెలిపాడు. గతవారం జరిగిన పింక్బాల్ టెస్టుపై స్పందించిన ఫోక్స్.. అది కఠినమైన పిచ్ అని పేర్కొన్నాడు.
‘కచ్చితంగా మేం పూర్తిగా విఫలమయ్యాం. చెన్నై, మొతేరా పిచ్లు కష్టతరమైనవి. కానీ, టీమ్ఇండియా మాకన్నా బాగా ఆడింది. ఆ జట్టులో పలువురు నాణ్యమైన స్పిన్నర్లున్నారు. దాంతో వారి బౌలింగ్కు మా వద్ద సమాధానం కరవైంది. ఇక రాబోయే మ్యాచ్లో మరింత జాగ్రత్తగా ఆడి వారిని ఎదుర్కొని భారీ స్కోర్ సాధించాలి. అయితే, ఆ మ్యాచ్లో ఎలాంటి పిచ్ ఉండబోతుందనే విషయంపై మాకో స్పష్టమైన అవగాహన ఉంది. తొలి బంతి నుంచే విపరీతమైన టర్నింగ్ ఉంటుందని మేం అనకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో బాగా ఆడడానికి సరైన మార్గం అన్వేషించాలి’ అని ఇంగ్లాండ్ కీపర్ చెప్పుకొచ్చాడు.
అలాగే గత రెండు టెస్టుల్లోనూ పిచ్ కఠినంగా ఉందని, ఇలాంటి వాటిని ముందెప్పుడూ చూడలేదని ఫోక్స్ అన్నాడు. ముఖ్యంగా పింక్బాల్ టెస్టులో బంతి మరీ ఎక్కువగా తిరిగిందన్నాడు. ఇలాంటి పిచ్లపై కీపింగ్ చేయడం కష్టంగా మారిందన్నాడు. ఇక వరుసగా రెండు టెస్టులు ఓటమిపాలైనా ఇప్పటికీ తమకు సిరీస్ డ్రా చేసుకునే అవకాశం ఉందన్నాడు. చివరి మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసి 2-2తేడాతో తిరిగి స్వదేశానికి వెళితే అది బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.