ఇంటర్నెట్డెస్క్: టీమిండియా మాజీ బ్యాట్స్మన్ సురేశ్ రైనా శుక్రవారంతో 34 ఏళ్లు పూర్తిచేసుకోనున్నాడు. ఈ సందర్భంగా అతడు ఉత్తరప్రదేశ్, జమ్మూ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని 34 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన కూతురు పేరు మీదగా ఏర్పాటు చేసిన గ్రేసియా రైనా ఫౌండేషన్తో ఈ సేవలు అందించనున్నట్లు తెలిపాడు. తాగునీటి సదుపాయం, బాలురు, బాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు నిర్మించడం, స్మార్ట్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నాడు.
‘‘నా పుట్టినరోజును ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు నాణ్యమైన విద్యకు అర్హులు. పాఠశాలల్లో మంచి నీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు ఉండాలి. వీటిని యువా అన్స్టాపబుల్ సహకారంతో గ్రేసియా రైనా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాం. మౌలిక సదుపాయాల వల్ల ఎన్నో వేల మంది విద్యార్థులకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది మంచి ఆరంభం. భవిష్యత్తుల్లో మరిన్ని పాఠశాలలకు మా సాయాన్ని అందిస్తాం. ఇంతకన్నా గొప్పగా జన్మదిన వేడుకుల్ని జరుపుకోలేను. ఇది మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది’’ అని రైనా తెలిపాడు. అంతేగాక ఆ పాఠశాలల్లో ఆరోగ్య, శాస్త్రీయ అంశాలకు సంబంధించిన విషయాలపై అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తామని అతడు పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15న రైనా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.