అత్యాచారం కేసు నిందితుడిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
దిల్లీ: అత్యాచారానికి గురయిన బాలికను పెళ్లిచేసుకోవడం ఇష్టమేనా? అని సోమవారం సుప్రీంకోర్టు నిందితుడిని ప్రశ్నించింది. మహారాష్ట్ర విద్యుత్తు ఉత్పాదన సంస్థలో టెక్నీషియన్గా పనిచేస్తున్న మోహిత్ సుభాష్ చవాన్ (23)పై అత్యాచారం కేసు నమోదయింది. 2014-15 ప్రాంతంలో తన దగ్గర బంధువైన బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు అందింది. అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయింది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేయగా, బాంబే హైకోర్టు తిరస్కరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా...‘‘మీరు ఆమెను పెళ్లాడుతారా? పెళ్లాడుతామంటే మేం పరిశీలిస్తాం. లేదంటే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగని పెళ్లి చేసుకోవాలని మేమేమీ ఒత్తిడి తేవడం లేదు’’ అని పేర్కొంది. అయితే ఆయనకు ఇప్పటికే వేరే మహిళతో వివాహం జరిగిందని నిందితుని తరఫు న్యాయవాది తెలిపారు. తొలుత ఆ బాలికనే పెళ్లాడాలని అనుకున్నారని, కానీ అందుకు ఆమె తిరస్కరించడంతో వేరేవారిని చేసుకున్నారని చెప్పారు. ఆయనను అరెస్టు చేస్తే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అత్యాచారం చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అని తెలియదా అని ప్రశ్నించింది. రెగ్యులర్ బెయిల్ కోసం చేసిన దరఖాస్తును తిరస్కరించింది. అయితే నాలుగు వారాల పాటు అరెస్టు చేయకుండా ఊరటనిచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం సంబంధిత కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఇంకా అభియోగపత్రం దాఖలు చేయని విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ వెసులుబాటు ఇచ్చింది.