శ్వేతసౌధ మిలటరీ కార్యాలయ డైరెక్టర్గా మజూ వర్గీస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తన పాలనావిభాగంలో మరో భారతీయ అమెరికన్కు కీలక బాధ్యతలు అప్పగించారు. స్వయానా బైడెన్కు ఉప సహాయకుడిగా, శ్వేతసౌధ సైనిక కార్యాలయ డైరెక్టర్గా మజూ వర్గీస్ను నియమించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన వర్గీస్ గతేడాది బైడెన్ - హారిస్ ఎన్నికల ప్రచారంలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా, సీనియర్ సలహాదారుగా సేవలందించారు. ఇపుడు మిలటరీ ఆఫీస్ డైరెక్టర్గా తనను నియమించినట్టు వర్గీస్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. శ్వేతసౌధంలో మిలటరీ కార్యాలయం అనేది.. అక్కడ జరిగే పలు అధికారిక వేడుకలు, వైద్య సదుపాయం, అత్యవసర సేవలు, అధ్యక్షుని రవాణా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ఫోర్స్-వన్ డైరెక్టరు కనుసన్నల్లోనే ఉంటుంది. వర్గీస్ వీటన్నిటికీ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న పరిస్థితులు, క్యాపిటల్ భవనంపై దాడుల నేపథ్యంలో.. బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలోనూ ఈయన కీలకపాత్ర పోషించారు. నాలుగు పదుల వయసు నిండిన వర్గీస్ కేరళ వాసి. ఈయన తల్లిదండ్రులు ఆ రాష్ట్రంలోని తిరువల్ల నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి వర్గీస్ రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చేశారు.
ఒబామా హయాంలోనూ..
గతంలో.. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాకు సహాయక అధికారిగా ఉన్న వర్గీస్.. ఆయన పాలనాకాలంలో శ్వేతసౌధంలో పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. తాజా నియామకంతో రెండోసారి శ్వేతసౌధంలో పనిచేయనున్నారు.