కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే
పనాజీ: మరో రెండు, మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్ననేపథ్యంలో వ్యాక్సిన్ రాగానే దేశంలో కరోనా పూర్తిస్థాయిలో కనుమరుగవుతుందని కేంద్రమంత్రి రామ్దాస్ అఠావలే తెలిపారు. సోమవారం గోవా రాజధాని పనాజీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కరోనా వైరస్ ఉంటే మరో ఆరునెలలు దేశంలో ఉండొచ్చేమో కానీ, ఒక్కసారి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే కరోనా ఇక ఇక్కడ కనిపించదు.’’ అని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి ‘గో కరోనా గో’ అనే నినాదాన్ని వినిపించారు. ఈ నినాదాన్ని ఆయన పేర్కొంటూ.. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆయన తెలిపారు. గోవా, మహారాష్ట్రల్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని ఆయన తెలిపారు. మరోవైపు ఫైజర్, భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్లు తయారుచేసిన టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతినిమ్మంటూ సదరు కంపెనీలు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి.
ఇవీ చదవండి..