లద్దాఖ్: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడికి కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని లేహ్లో కొత్త ఆంక్షలు విధించారు. నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడరాదని అధికారులు ఆదేశించారు. ఈ రోజు నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా వాహనాల్లో కేవలం 50శాతం సామర్థ్యంతోనే నిర్వహించేందుకు అనుమతించనున్నట్టు తెలిపారు. మిగతా ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు. విపత్తు నిర్వహణ చట్టానికి లోబడి లేహ్ మేజిస్ట్రేట్ సచిన్ కుమార్ వైశ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. లేహ్ జిల్లా వ్యాప్తంగా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు.
వివాహాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టంచేశారు. కాగా.. గత నెల రోజులుగా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి సడలింపులూ లేవని అధికారులు చెప్పారు. లద్దాఖ్లో ఇప్పటివరకు 8,228 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 113మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం లద్దాఖ్లో 961 యాక్టివ్ కేసులు ఉన్నాయి.