దిల్లీ: దేశరాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఏర్పాటైన అల్మీ మార్కాజ్ మత సమావేశంలో మొత్తం 2361 మంది పాల్గొన్నారని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. వారిలో కరోనా లక్షణాలు ఉన్న 617 మందిని అస్పత్రులకు... మిగిలిన వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్టు ఆయన తెలిపారు. అనంతరం నిజాముద్దీన్ దర్గాతో సహా ఆ ప్రాంతాన్నంతటినీ శానిటైజ్ చేశారు. దిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. తరలించిన వారి జాబితాను అన్ని ప్రభుత్వ విభాగాలకు అందజేశారు.
ఈ మేరకు ట్విటర్ ఖాతా ద్వారా విడుదల చేసిన ఓ ప్రకటనలో...ఈ తెల్లవారుఝామున నాలుగు గంటలకల్లా తబ్లిగి జమాత్ సమావేశం ఏర్పాటు చేసిన భవనాన్ని ఖాళీచేయించామని సిసోడియా వివరించారు. ఇందుకుగాను వైద్య సిబ్బంది, అధికారులు, పోలీసులు, దిల్లీ ప్రజా రవాణా సంస్థ సిబ్బంది 36 గంటల పాటు శ్రమించారని పేర్కొన్నారు. కాగా, తమ జీవితాలను పణంగా పెట్టి ఈ ఆపరేషన్లో పాల్గొన్న వారందరికీ మనీష్ సిసోడియా అభినందనలు తెలియజేశారు.
కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో 200 మందికి పైగా గుమిగూడటంపై దిల్లీ ప్రభుత్వం మార్చి 13 నుంచి నిషేధం విధించింది. ఈ నిబంధనలను అతిక్రమించినందుకు మర్కాజ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తబ్లిగి జమాత్ ఘటనపై సకాలంలో స్పందించకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.