అభ్యర్థిని ప్రతిపాదించానని దాడి
న్యూస్టుడే, తిరుపతి (నేరవిభాగం): తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసిన వ్యక్తికి ప్రతిపాదించానన్న అక్కసుతో తనపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి.. పళ్లు ఊడగొట్టారని తిరుపతికి చెందిన తెదేపా కార్యకర్త గోళ్ల లోకేష్నాయుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి కార్పొరేషన్లోని ఆరు డివిజన్లలో నామినేషన్లను స్వీకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని 45వ డివిజన్ నుంచి చంద్రమోహన్ అనే వ్యక్తి తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేయగా, ఆయన అభ్యర్థిత్వాన్ని లోకేష్నాయుడు ప్రతిపాదించారు. ఉదయం వార్డు కార్యాలయానికి వచ్చినప్పటి నుంచే అక్కడే ఉన్న 47వ వార్డు టౌన్ప్లానింగ్ కార్యదర్శి సురేంద్ర.. తనపై ఒత్తిడి తెచ్చినట్లు లోకేష్నాయుడు చెబుతున్నారు. అయినా చంద్రమోహన్ నామినేషన్ దాఖలు చేయగా తాను ప్రతిపాదిస్తూ సంతకం చేశానన్నారు. సాయంత్రం చంద్రమోహన్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రకాశం పార్కు పక్కనే ఉన్న తన దుకాణాన్ని వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారని, తాను పారిపోయేందుకు ప్రయత్నించినా వదల్లేదని లోకేష్నాయుడు విలేకర్లకు చెప్పారు. తనపై దాడి చేయడంతో రెండు పళ్లు ఊడిపోయాయని చూపించారు. భయంతో పరుగున అలిపిరి పోలీసుస్టేషన్కు వెళ్లగా ఆయన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. దాడి ఘటన తెలుసుకున్న తెదేపా నాయకులు పోలీసుస్టేషన్కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కాగా 47వ వార్డు టౌన్ ప్లానింగ్ కార్యదర్శి సురేంద్ర తప్పిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు అలిపిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.