సిమ్ స్వాప్, ఫిషింగ్ మెయిల్స్తో నేరాలు
ఐదుగురు అరెస్ట్.. పరారీలో కీలక సూత్రధారి
ఈనాడు, హైదరాబాద్: ముంబయి కేంద్రంగా ఓ ముఠా చేస్తున్న సైబర్ నేరాలను సైబరాబాద్ పోలీసులు ఛేదించి ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి.సజ్జనార్ ఈ వివరాలను వెల్లడించారు. నైజీరియాలో ఉండే జేమ్స్ ముంబయి మీరా రోడ్లోని చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లే, జమీర్ అహ్మద్ మునీర్ సయ్యద్, షోహెబ్ షేక్, అదిల్ హసన్ అలీ సయ్యద్, జునాయిద్ అహ్మద్ షేక్, అశ్విన్ నారాయణ్ షెరాగర్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. జేమ్స్ వివిధ కంపెనీలు, సంస్థల ఈ-మెయిల్స్ను హ్యాక్ చేసి ఆదాయపు పన్నుశాఖ పేరిట ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. అవి అసలైనవిగా భావించి కొందరు బ్యాంకు ఖాతా, రిజిస్టర్ మొబైల్ నంబరు, చిరునామా తదితర వివరాలను పంచుకునేవారు. అలా సేకరించిన మొబైల్ నంబర్లను జేమ్స్ ముంబయిలోని చంద్రకాంత్కు చేరవేస్తాడు. అతడు వాటి ఆధారంగా ఖాతాదారుల వివరాలు, వ్యక్తిగత సమాచారం సేకరించేవాడు. నకిలీ ఆధార్ కార్డులు, సంస్థల రబ్బరు స్టాంపులు తయారు చేయించేవాడు. జమీర్, జునాయిద్ నకిలీ వివరాలతో కొత్త సిమ్కార్డులు పొందేవారు. చంద్రకాంత్ చేతికి ఖాతా వివరాలు, కొత్త సిమ్కార్డులు (రిజిస్టర్ మొబైల్ నంబర్లు) అందగానే వాటిని జేమ్స్కు చేరుస్తాడు. ఇంటర్నెట్ అక్రమ లావాదేవీలో రూ.లక్షలు కొల్లగొట్టి ఆ సొమ్మును షోయబ్, అశ్విన్ నారాయణ్ పేరిట ఉన్న ఖాతాల్లోకి మళ్లించేవారు. ఆ ఇద్దరూ నగదు విత్డ్రా చేసి జేమ్స్కు హవాలా లేదా బిట్కాయిన్ రూపంలో బదిలీ చేసేవారు. తిరిగి జేమ్స్ ముఠా సభ్యులకు కమీషన్ ఇచ్చేవాడు. 2011 నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠాపై పలు ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ బృందం దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఐదుగురిని అరెస్ట్ చేసింది. జేమ్స్, మరో నిందితుడు షోయబ్ షేక్ పరారీలో ఉన్నారు.