రూ. 1,400 కోట్ల అనధికారిక లావాదేవీల గుర్తింపు
దిల్లీ: రాజస్థాన్లోని జైపుర్కు చెందిన ఓ ఆభరణాల సంస్థ, రెండు స్థిరాస్తి గ్రూపులపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నిర్వహించిన దాడుల్లో రూ. 1,400 కోట్ల మేర లెక్కల్లో చూపని లావాదేవీలను గుర్తించింది. ఆయా సంస్థలకు చెందిన 31 ప్రాంతాల్లో గురువారం ఐటీ శాఖ సోదాలు జరిపినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) తెలిపింది. ఈ సందర్భంగా అనధికారిక లావాదేవీలకు సంబంధించిన వివిధ పత్రాలు, రసీదులు వంటివాటిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఆభరణాల సంస్థ గత ఆరేళ్లుగా ఇలా పన్నులను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది.
ఠాణేలో సోదాలు..
మహారాష్ట్రలోని ఠాణే జిల్లాకు చెందిన ప్రముఖ బిల్డర్లపైనా ఐటీ శాఖ దాడులు చేసింది. ఈమేరకు రూ. 520 కోట్ల లెక్కల్లో చూపని లావాదేవీలను గుర్తించినట్లు సీబీడీటీ గురువారం వెల్లడించింది. బొరివలి, మీరా రోడ్డు, భయాందర్ ప్రాంతాల్లో ఈనెల 12న ఈ సోదాలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా రూ. 10.16 కోట్ల మేర లెక్కల్లో చూపని నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.