15 రోజులుగా పనిమనిషిపై యజమాని పైశాచికం
ఈనాడు, హైదరాబాద్, న్యూస్టుడే, జూబ్లీహిల్స్: ఇంట్లో పనులు చేసేందుకు వచ్చిన ఓ మహిళను నిర్బంధించడమే కాకుండా ఆమెపై ఇంటి యజమాని అత్యాచారం చేశాడు. పదిహేనురోజుల తర్వాత బాధిత మహిళ కుమార్తె సమాచారంతో బందీగా ఉన్న ఆమెను బంజారాహిల్స్ పోలీసులు రక్షించారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలిస్తున్నామని ఎస్సై వాసవి శనివారం తెలిపారు.
రాజమహేంద్రవరం ప్రాంత మహిళ(45)కు 2002లో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే భర్త వదిలిపెట్టడంతో విడిగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె కుమార్తె హైదరాబాద్లో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తీరకపోవడంతో ఇళ్లల్లో పనులు చేస్తానంటూ ఆమె స్నేహితురాలు ధనలక్ష్మికి చెప్పింది. ధనలక్ష్మి రవీందర్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. సరేనన్న రవీందర్.. హైదరాబాద్లో వంటపని, ఇంటిపని కోసం పిలిచారని, మంచి జీతం ఇస్తారని వివరించారు. ఆమె అంగీకరించడంతో ఫిబ్రవరి 17న రాజమహేంద్రవరం నుంచి రైలులో హైదరాబాద్కు బయలు దేరింది. అదేరోజు ఫిలింనగర్లోని ఓ అపార్ట్మెంట్లోని 19వ అంతస్తులోని ఫ్లాట్ నంబరు 1905లో ఉదయభాను నివాసానికి చేరుకుంది.
రెండోరోజే బలాత్కారం..: తొలుత సాదరంగా ఆహ్వానించిన ఉదయభాను తనకు చిత్రపరిశ్రమకు చెందిన వారితో సంబంధాలున్నాయని, గుత్తేదారుగా పనిచేస్తున్నానని చెప్పాడు. తన ఇంట్లోనే ఒక చిన్న గదిని ఆమెకు కేటాయించాడు. ఇక రెండోరోజే ఉదయభాను ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. కొట్టాడు. రాత్రి ఆమెపై లైంగికదాడి చేశాడు. ఈవిషయం ఎవరికీ చెప్పకుండా ఆమె వద్ద ఉన్న చరవాణిని లాక్కున్నాడు. ఇంట్లో పనులు చేయించుకుని బయటకు వెళ్లేప్పుడు ఆమెను గదిలో నిర్బంధించేవాడు. ఇలా రోజూ విపరీతంగా కొట్టి అత్యాచారం చేసేవాడు. ఎలాగైనా చెర నుంచి తప్పించుకోవాలనుకున్న ఆమె ఉదయభానుకు తెలియకుండా శుక్రవారం రాత్రి తన చరవాణిని తీసుకుంది. శనివారం ఉదయం పదిగంటలైనా ఉదయభాను రాకపోవడంతో వెంటనే తన కుమార్తెకు ఫోన్ చేసింది. అప్రమత్తమైన బాధిత మహిళ కూతురు చరవాణి సిగ్నల్స్ ఆధారంగా గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోల్కొండ పోలీసులు బంజారాహిల్స్ ఠాణాకు విషయాన్ని వివరించగా.. ఎస్సై వాసవి, ఎస్సై రాంబాబు తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొన్నారు. 19వ అంతస్తుకు వెళ్లిన వారు తాళం వేసి ఉండటంతో ఉదయభానుకు ఫోన్ చేశారు. అతని ఫోన్ అందుబాటులో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సికింద్రాబాద్లో ఉండే అతడి కుటుంబ సభ్యులు ఇంటి తాళం తీసుకొని రావడంతో మహిళను రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదయభానుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిపై గతంలోనూ కేసులున్నాయని వివరించారు.