పరాయి పురుషుల వద్దకు వెళ్లాలంటూ భర్త ఒత్తిడి
దిశ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి...
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే
కట్టుకున్న భార్య నగ్న వీడియోలు, ఫొటోలను అంతర్జాలంలో పెట్టి వ్యాపారం చేస్తున్నాడు ఆ నీచుడు. పరాయి పురుషుల వద్దకు వెళ్లమని ఒత్తిడి చేశాడు. దీనిని భరించలేని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు విశ్వసనీయ సమాచారం.
గుంటూరుకు చెందిన ఓ యువతిని మూడేళ్ల కిందట నగరానికే చెందిన యువకుడు తాను ఎయిర్ఫోర్సులో ఉద్యోగినంటూ నమ్మించి భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకొని వివాహం చేసుకున్నాడు. వివాహమైనప్పటి నుంచి తనకు ఎయిర్పోర్టు, విమానాలు చూపించాలని భార్య భర్తను కోరింది. అప్పుడు అసలు అతనికి ఎటువంటి ఉద్యోగం లేదని తెలిసి కంగుతిన్నది. ఈ విషయమై ఇరు కుటుంబాల్లో కొంత స్పర్థలు వచ్చినా ఆడపిల్ల కాపురం నిలబడాలని సర్ది చెప్పడంతో భార్యాభర్తలు కలసి ఉంటున్నారు. ఆ యువకుడు ఓ కొరియర్ సంస్థను పెట్టి నగదు నష్టపోయాడు. జల్సాలకు అలవాటు పడిన అతను సులువుగా డబ్బులు సంపాదించడానికి నీచపు పనులకు దిగాడు.
కొద్దిరోజుల క్రితం పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని భర్త ఒత్తిడి చేయడంతో ఆమె నిర్ఘాంతపోయింది. తాను చెప్పినట్లు వినకపోతే చనిపోతానంటూ తలను గోడకు వేసుకొని కొట్టుకుంటూ బెదిరించడంతో ఏడ్చుకుంటూ దిశ పోలీసుస్టేషన్కు వచ్చింది. భర్త వికృతంగా వేధిస్తున్నాడంటూ చెప్పడమే తప్ప మిగిలిన విషయాలు చెప్పడానికి సంకోచించింది. ఈ విషయం తెలిసిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు చేయాలని డీఎస్పీ సుప్రజను ఆదేశించారు. డీఎస్పీ ఆమెను ఓదార్ఛి..అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీంతో ఆ బాధితురాలు పరాయి వ్యక్తి వద్దకు వెళ్లి డబ్బులు సంపాదించాలని భర్త బెదిరిస్తున్నాడని తెలిపింది. దీంతో భర్తను పిలిచి డీఎస్పీ లోతుగా దర్యాప్తు చేపట్టారు. కొంత కాలంగా తన భార్యకు తెలియకుండా ఆమె నిద్రపోతున్నప్పుడు నగ్న ఫొటోలు తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడని, ఎక్కువ మంది ఆ వీడియోలు చూస్తే డబ్బులు వస్తాయని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఏకాంతంగా గడిపిన వీడియోలను కొత్తగా వచ్చిన యాప్ల ద్వారా లైవ్గా పెట్టి భర్త తన బ్యాంకు ఖాతాకు నగదు జమచేయించుకునే వాడని తెలిసింది. అలా యూట్యూబ్, యాప్లలో లైవ్ల ద్వారా సంప్రదించిన వారి వద్దకు ఆమెను పంపించి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలనే నికృష్టపు ఆలోచన చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా తన భార్యను పరాయి పురుషుల వద్దకు వెళితే డబ్బులు వస్తాయని, అందుకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశాడని గుర్తించారు. అతను పెట్టే మానసిక క్షోభను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని సైబర్ నిపుణులను రంగంలోకి దించారు. ఆ యువతి పరువు కాపాడేందుకు ఇప్పటివరకు భర్త అంతర్జాలంలో పెట్టిన ఫొటోలు, వీడియోలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడిపై చర్యలు తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. ఈ విషయమై అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని ‘న్యూస్టుడే’ సంప్రదించగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై దిశ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, విచారణ ముగిసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.