రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. కాగా, ఈ ఘటన స్థానికంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది.
దుర్గ్ జిల్లా ఏఎస్పీ ప్రజ్ఞా మేశ్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గ్ జిల్లాలోని బతేనా గ్రామంలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే.. కుటుంబ యజమాని, ఆయన కుమారుడు ఒకే తాడుకు ఉరి వేసుకొని మరణించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు ఇంటి బయట ఉన్న ఎండుగడ్డిపై పూర్తిగా కాలిపోయి ఉన్నాయి.
సైబర్, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను ఘటనా స్థలికి పంపి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పరిస్థితిని చూస్తే ఆత్మహత్యగానే ఉన్నప్పటికీ.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్ట్ మార్టం నివేదికలు వచ్చాక మరిన్ని వివరాలు చెబుతామన్నారు. మృతులను గైక్వాడ్(55), ఆయన భార్య జానకీ బాయి(45), కుమారుడు సంజు గైక్వాడ్(24), కుమార్తెలు దుర్గా(28), జ్యోతి(21) గా గుర్తించారు.