పెద్ద అడిశర్లపల్లి: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్తో పాటు మరో ఎనిమిది మంది మృతిచెందారు. ప్రమాద స్థలిలో ఆరుగురు, హైదరాబాద్, దేవరకొండలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి పరిశీలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతిచెందిన వారి వివరాలు
1.ఆటో డ్రైవర్ మల్లేశ్
2. డ్రైవర్ తల్లి పెద్దమ్మ
3. డ్రైవర్ భార్య చంద్రకళ
4. గొడుగు లింగమ్మ
5. నోముల సైదమ్మ
6. అంజమ్మ
7. ఇద్దమ్మ
8. నోములు అలివేలు
9.కొట్టం పెద్దమ్మ
కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రోడ్డు ప్రమాదం పట్ల గవర్నర్ దిగ్భ్రాంతి..
రోడ్డు ప్రమాద ఘటన పట్ల గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
ఇవీ చదవండి..