ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖకు సంబంధించి విజయవాడలో రూ.13.80 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం తరలించనుంది. దీన్ని తొలుత విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అందుకు అనుమతులూ మంజూరయ్యాయి. కానీ విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం పాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని డీజీపీకి సూచించారు. మూడు రాజధానులు అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో... పరిపాలనా రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నానికి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తరలించే అంశం చర్చనీయాంశమైంది.